ఎన్నో వేల సంవత్సరాల క్రితమే పుట్టిన చతుర్వేదములలో మొదటి భాగమైన ఋగ్వేదమునందు సంహితభాగమున జ్యోతిష్యం గురించిన ప్రస్థావన ఉన్నది. సూర్యుడు, గ్రహములు, నక్షత్రములకు సంబంధించిన అనేక విషయాలు చాలా విపులంగా కధలుగా మన పురాణాలలో నిక్షిప్తం చేయబడ్డాయి. ప్రత్యక్ష దైవం కర్మ సాక్షి అయిన ఆ సూర్య భగవానుడ్ని ఆధారముగా భావించి ఈ విశ్వము గురించిన ఎన్నో రహ స్యాలను సూక్ష్మాతిసూక్ష్మ సిధ్ధాంతాలను మానవాళికి అందించిన శాస్త్రవేత్తలు ఆర్యభట్ట, వరాహమిహిరుడు, భాస్కారాచార్య వంటి మహాను భావులు పుట్టింది మన భారతదేశంలోనే.
ఖగోళశాస్త్రం ఆధారంగానే జ్యోతిష్యశాస్త్రం ఏర్పడింది. జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించిన మూల గ్రంధాలు చాలామటుకు కాలగర్భంలో కలిసిపోయినప్పటీకీ పరాశరసంహిత, కాశ్యపసంహిత, పంచసిధ్ధాంతిక, బృహత్సంహిత వంటి మొద లైన గ్రంధాల ఆధారంగా నేటికీ జ్యోతిష్య శాస్త్రం తన ప్రాబల్యాన్ని చాటి చెబుతోంది. జ్యోతిష్యం లేక జోస్యం ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది విశ్వసించే విధానము. ఇది నిర్ధుష్టమైన హింధూ ధర్మశాస్త్రము. మనిషి జీవితంలో జరుగుతున్నదీ, జరుగబోయేదీ జననకాల గ్రహస్థితి ప్రకారము, శరీర లక్షణాలు, అరచేతులు, మొదలగు వివిధ అంశాలను ఆధారం చేసుకొని చెప్ప బడుతుంది.
ఆరు వేదాంగాలలో జ్యోతిష్యం ఒకటి. ఇప్పటికీ ఆదరణ పొందుతున్న ప్రాచీన శాస్త్రాలలో ఇది కూడా ఉంది. హింధూ సాంప్రదాయాల మరియు విశ్వాసం నమ్మకాలలో జన్మ సిధ్ధాంతం ఒకటి. ఈ జన్మ సిధ్ధాంతం ప్రకారం పూర్వజన్మ పాపపుణ్యాల ప్రభావం ప్రస్తుత జన్మలోనూ దానికి తగిన విధంగా, తగిన సమయంలోనే జీవిజననం ఈ జన్మలో జరుగుతుంది. అనగా అటువంటి గ్రహ స్థితి సమీపించగానే జీవి జననం జరుగును. ఇదంతా దైవలీలగా హింధువులు భావిస్తారు. కావున ప్రతిజీవి భూతభవిష్యత్వర్తమాన కాలములు జననకాల గ్రహ స్థితి ప్రకారం జరుగుతాయి. ఇది హింధువుల ప్రగాఢ విశ్వాసము.
ఈ భూగోళం పుట్టినప్పటినుండి మనిషి బుర్రను తొలొచివేస్తున్న ప్రశ్నలివి. మహా మేధావులు కూడా వీటికి సరియైన సమాధానం చెప్పినా అవి ఊహాపోహలే తప్ప ప్రత్యక్షప్రమాణాలు కావు. కానీ కొంతమంది తత్త్వవేత్తలు తమ శుద్ధమనస్సుతో చూచి కొన్నిసమా ధానాలు కనుగొని మనకు అందించారు. ఆ సమాధానాలు పొందుపరచబడిన గ్రంధాలే మనకు వేదాలు. సాధారణ తామసిక మన
స్సుల కందని సత్యాలను ప్రకాశింప చేసేవే శాస్త్రాలని హింధువుల విశ్వాసం. అటువంటి శాస్త్రాలలో ఒకటి ఈ జ్యోతిష్య శాస్త్రం.
అనేక ఆటుపోట్లను ఎదుర్కొని కొన్ని వందల శతాబ్ధాల తరబడి ఏ మాత్రం చెక్కుచెదరకుండా ఇంతలా ఒక శాస్త్రం తన మనుగడ సాగిస్తోందీ అంటే అది చాలా గొప్ప విషయంగా చెప్పక తప్పదు. కేవలం ఎవరో ఋషులు చెప్పారని ఇన్ని వందల సంవత్సరాలుగా ఒక విషయాన్ని మనం కొనసాగించలేము కదా! ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ మనకీ మానవ జన్మలభించదు. అందునా గొప్ప సంస్కృతీ సంప్రదాయాలు కలిగిన భారత దేశంలో పుట్టడం నిజంగా మన అదృష్టం. ఇక్కడి గాలి పవిత్రం, నీరు పవిత్రం. ఇక్కడ అనాదిగా వస్తూ ఉన్న ఆచార సాంప్రదయాలతో భారతదేశ ప్రజలు సాగిస్తున్న జీవనశైలి ఇతర దేశాల వారికి ఎంతో ఆదర్శ ప్రాయమైనది.
ఇంతకీ జ్యోతిష్యం అంటే ఏమిటి?
జ్యోతిశ్ అనగా ప్రకాశవంతమైనదీ అని అర్ధము. జ్యోతిష్య శాస్త్రం అనేది అనేక వ్యవస్థలు, సాంప్రదాయాలు, విశ్వాసాల సమాహారం. ఇందులో ఖగోళ వస్తువుల స్థితిగతులను మరియు అనుబంధిత అంశాల వివరములను ఉపయోగించి వ్యక్తిత్వం, మానవ సంబంధములు, ఇతర భూగోళ విషయాలకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేయు శాస్త్రం. జ్యోతిష్యశాస్త్రాన్ని ఆంగ్ల
ములో “ASTROLOGY” అని అంటారు. పురాతన గ్రీకు భాషలో astron అంటే ‘నక్షత్ర రాశి లేక నక్షత్ర సమూహం’ మరియు logia అంటే ‘గురించిన అధ్యయనం’ అని అర్ధం. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న ఆకాంక్ష ప్రతివ్యక్తిలోనూ ఉంటుంది. జీవితంలో జరిగే మంచి చెడులను తెలుసుకునేందుకు జ్యోతిష్కులను ఆశ్రయిస్తుంటారు.
కొందరు హస్తసాముద్రికం ఆధారముగా చెబుతూండగా, ఇంకొందరు సంఖ్యాశాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని, మరికొందరు గ్రహ సంచారాల ఆధారంగా జాతకాలు చెబుతుంటారు. చేతిలోని రేఖల ఆధారంగా చెప్పేది హస్తసాముద్రికం కాగా గ్రహగతుల ఆధారంగా చెప్పేది జన్మ కుండలి ఆధారిత జ్యోతిష్యం. జన్మకుండలి ద్వారా జాతకాలు తెలుసుకునేందుకు వ్యక్తి పుట్టినతేదీ (నెల, సంవత్సరంతో సహా) సమయం, పుట్టిన ప్రదేశం తప్పనిసరి. ఇవన్నీ ఖచ్చితముగా ఉంటేనే జాతకం కూడా ఖచ్చితంగా చెప్పే అవకాశం ఉంటుంది. జనన సమయం సరిగా ఉండాలి. ఇదే లగ్నం నిర్ణయించేందుకు ముఖ్య ఆధారం. ఈ లగ్నాన్ని బట్టే ఫలితాలు నిర్ధారించడం సాధ్యం అవుతుంది. అలాగే లగ్నం ఖచ్చితంగా నిర్ధారించేందుకు పుట్టిన ప్రదేశం కూడా ముఖ్యమే.
సూర్యోదయ సమయాలు ఆయా ప్రాంతాలను బట్టి కొన్ని నిముషాలు హెచ్చు తగ్గులుంటాయి. దీని ఆధారంగా లగ్న నిర్ణయం చేయాల్సి ఉంటుంది. మేషాది మీన రాశి వరుకూ ఒక్కొక్క రాశి ప్రమాణం సుమారు రెండు గంటల వరుకు వుండవచ్చు. ఒక్కోసారి నిముషాల తేడాలో లగ్నం మారవచ్చు. పుట్టిన ప్రదేశం తెలుసుకోవడం ద్వారా లగ్నంలో తేడాలు రాకుండా చూసే అవకాశముంటుంది. కొందరికి పుట్టిన తేదీ,సమయాలు తెలియవు. వారి పెద్దలు చెప్పే కొండగుర్తుల ద్వారా కొంతవరకూ సంవత్సరం, తేదీ, నక్షత్రం వంటివి నిర్ధారించవచ్చు. అయితే జన్మ కుండలి వేయడం ద్వారా సాధ్యంకాదు. కేవలం రాశి ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు లేదా “ప్రశ్న” ద్వారా తెలుసుకోవచ్చు..
-చింతా గోపీ శర్మ సిద్ధాంతి
లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం (భువనేశ్వరిపీఠం)
పెద్దాపురం, సెల్:- 9866193557