గోదానం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి?

అన్ని దానాల్లో గోదానం విశిష్టమైనదిగా ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. గోదాన ప్రాధాన్యాన్ని తెలుసుకునేందుకు ధర్మరాజు అంపశయ్యపై వున్న భీష్ముని దగ్గరకు వెళ్లాడు. గోదాన విశిష్టతను తెలపమని కోరడంతో గాంగేయుడు ఒక పురాణ వృత్తాంతాన్ని వివరించాడు. దీని ద్వారా గోదానం ఎంత గొప్పదో తెలుసుకోవచ్చు.
కొన్ని యుగాలకు పూర్వం ఔద్దాలకి అనే మహర్షి వుండేవాడు. నిత్యం యజ్ఞ జపాదులు నిర్వహించేవాడు. ఒకనాడు తన కుమారుడైన నాచికేతుడిని పిలిచి నదీ తీరంలో వున్న సమిధలు, దర్భలను తీసుకురమ్మని ఆదేశించాడు. నదీ తీరానికెళ్లిన నాచికేతుడికి అవి కనిపించలేదు. నది పొంగడంతో అవి నదీగర్భంలో కలిసిపోయాయి. తండ్రి దగ్గరకు వెళ్లి విషయాన్ని చెప్పాడు. అప్పటికే ఆకలితో వున్న మహర్షి యజ్ఞకార్యాన్ని పూర్తిచేయాలన్న నిశ్చయంతో వున్నాడు. ఇంతలో కుమారుడు ఈ విషయాన్ని వెల్లడించడంతో పట్టరాని కోపంతో నాచికేతున్ని నరకానికి వెళ్లు అని శపించాడు. తండ్రి ఆజ్ఞను పాటిస్తున్నానని నాచికేతుడు కూలిపోయాడు. వెంటనే అతని ప్రాణాలు నరకానికి వెళ్లిపోయాయి. తన తొందరపాటును తెలుసుకున్న ఔద్దాలకి ఆ రాత్రంతా రోదించాడు. సూర్యోదయ సమయానికి నాచికేతుని ప్రాణం తిరిగి వచ్చింది.
పట్టరాని ఆనందంతో కుమారుడిని కౌగిలించుకున్నాడు. రాత్రి ఏయే లోకాలకు వెళ్లింది వెల్లడించమన్నాడు. నాచికేతుడు ఆత్మ నరకం చేరుకునేసరికి అక్కడ యమధర్మరాజు స్వాగతం పలికాడు. ఔద్దాలకి మహర్షి నరకానికి వెళ్లమని శాపం పెట్టాడే గానీ చనిపొమ్మని శాపం ఇవ్వలేదు కనుక నాచికేతున్ని అతిథిగా పరిగణిస్తున్నట్టు యమధర్మరాజు చెప్పినట్టు నాచికేతుడు తెలిపాడు. అనంతరం నాచికేతుడికి అతిథి మర్యాదలు చేశాడు. తనకు పుణ్యలోకాలను చూపించమని యమధర్మరాజును కోరగా అతిథుల అభీష్టం నెరవేర్చడం తమ విధి అని యముడు పేర్కొన్నట్టు అతను తెలిపాడు. అనంతరం పుణ్యలోకాలను వీక్షించగా అందులో దివ్యతేజస్సులు కలిగిన పుణ్యపురుషులు వుండటాన్ని గమనించాడు.