కల్మషంలేని మనసు. స్వచ్ఛమైన నవ్వు. అన్నా అని పలకరించే ఆప్యాయత. ఏమ్మా బాగున్నావా అని అడిగే ఔదార్యం. ఎవరైనా బాధలో ఉంటే చూడలేని కళ్లు. అమ్మా అంటే ఆదుకునే హృదయం. వీటన్నింటికి మించి పట్టుదల. సముద్రానికైనా ఎదురెళ్లే సాహసం. ప్రజలకు సేవ చేయడంలో ఎందాకైనా ధైర్యం. ఇవన్నీ కలిపితే వైఎస్ భారతీ రెడ్డి. ఆమెను చూస్తుంటే ధైర్యాన్ని చూసినట్లు ఉంటుంది. అలానే ఆమె నడిచి వస్తుంటే ఆదిశక్తి నడిచి వస్తున్నట్లు ఉంటుంది. ఆమె ఓ సాహసం. ఆమె ఓ మార్గదర్శి. ఆమె గురించి చెప్పాలంటే అవనినే అక్షరమాల చేయాలి. నమస్తే మేడం అంటే చాలు..ఆమె నోటి నుంచి స్వచ్ఛమైన రాయలసీమ యాస. రాయలసీమ యాస ఇంత అందంగా ఉంటుందా అనిపిస్తుంది భారతీ రెడ్డిగారు మాట్లాడుతుంటే. ఆ యాసలో ఆమెలోని ప్రేమ కూడా ఉంటుంది.
మహానేత వైఎస్ఆర్ చనిపోయే వరకు భారతీ రెడ్డి అంటే తెలుగు నాట పెద్దగా తెలియదు. భారతీ రెడ్డిగారు గడప దాటి బయటకు వచ్చింది లేదు. ఇద్దరు ఆడ పిల్లల తల్లి. వారి ఆలనాపాలనా చూసుకుంటూ, కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇంట్లోనే ఉండేది. ఓ గృహిణిగా తన ధర్మాన్ని పాటించేది. వైఎస్ఆర్ మరణం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు,వారి కుటుంబంలో కూడా అనేక మార్పులు తీసుకొచ్చింది. తెలుగు నాట రాజకీయాల్లో మార్పులు వచ్చినట్లే వైఎస్ఆర్ కుటుంబంలో కూడా మార్పులు వచ్చాయి. వైఎస్ఆర్ మరణంతో కాంగ్రెస్లో శరవేగంగా మారిన రాజకీయాలు భారతీరెడ్డిగారిని ఆలోచనలో పడేశాయి. నల్ల కాల్వ దగ్గర భర్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటకు అండగా నిలవాలని వైఎస్ భారతీ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని నష్టాలు వచ్చినా ప్రజల కోసం ముందుకు సాగాలనే దృఢమైన నిర్ణయం తీసుకున్నారు. ఓదార్పు యాత్రను ఆపాలని సోనియా టెన్ జనపథ్కు పిలిచి చెప్పినప్పుడు ఆశ్చర్యపోయినా త్వరగా తేరుకున్నారు. ఈ తరువాత ఓదార్పు యాత్ర కొనసాగించాలని భర్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి అండగా ఉన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఇచ్చిన మాట తప్పకూడదు, ప్రజల కోసం పని చేయాలని భర్తకు చేదోడువాదోడుగా ఉన్నారు.
ఓదార్పు యాత్ర కొనసాగుతోంది. ఊరూరా వైఎస్ఆర్ విగ్రహాలు వెలుస్తున్నాయి. జనం తండోపతండాలుగా వస్తున్నారు. ఇదే సమయంలో రాజకీయ కుట్రలు కోరలు చాసి కాటేస్తున్నాయి. కాంగ్రెస్కు కుటిల నాయకుడు చంద్రబాబు కలిశాడు. ఢిల్లీలో కాంగ్రెస్ లీడర్లకు తప్పుడు మాటలు నూరిపోసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అవినీతి కేసులు పెట్టించారు. ప్రజలందరూ రాజకీయాలను దగ్గరుండి గమనిస్తున్నారు. హైదరాబాద్లోని దిల్ కుష్ గెస్ట్ హౌజ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విచారణకు అని పిలిచారు. విచారణ పేరుకే అరెస్ట్ చేయాల, వైఎస్ఆర్ సీపీని భూస్థాపితం చేయలనేది కాంగ్రెస్, చంద్రబాబు కుట్ర. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారంటూ ఎవరో చెప్పినట్లు ఎల్లో మీడియా ముందుగానే లీకులు. ఎల్లో మీడియా లీకులు ఇచ్చినట్లుగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నట్లు సీబీఐ ప్రకటించింది. ఆ రోజున దిల్ ఖుష్ గెస్ట్ హౌజ్ దగ్గర జరిగిన ఘటన నా జీవితంలో మరిచిపోలేను.
వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నారనే వార్తలతో ఏనాడు గడప దాటని వైఎస్ఆర్ కుటుంబ మహిళలు విజయమ్మ, షర్మిలమ్మ, భారతమ్మ దిల్ ఖుష్ గెస్ట్ హౌజ్ దగ్గరకు వచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎందకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు, ప్రశ్నించారు. ఫుట్ పాత్ మీద పడిగాపులు కాశారు. కాంగ్రెస్ను రెండు సార్లు అధికారంలోకి తీసుకు వచ్చిన మహానేత వైఎస్ఆర్ కుటుంబానికి చెందిన మహిళలు అని కూడా లేకుండా మహిళలను పోలీసులు ఈడ్చిపడేశారు. ఆ సమయంలో వైఎస్ భారతీ రెడ్డిగారు పోలీసులును అడ్డుకున్న తీరు ఆమెలోని ఆదిశక్తిని తెలుగు ప్రజలు చూశారు. అంతగా భర్త కోసం ఆమె తపించిపోయారు, పోరాడారు. తరువాత భర్త 16 నెలలు జైల్లో ఉన్నా ఎక్కడా కూడా అధైర్య పడకుండా ముందుకు సాగారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సమయంలో రాజకీయాలను, వ్యాపారాలను రెండింటిని చూసుకోవాల్సి వచ్చింది. కానీ..వైఎస్ భారతీ రెడ్డి ఎక్కడా కూడా తొణకలేదు, బెణకలేదు. ధైర్యంగా అడుగులేశారు. ఓ పక్క రాజకీయంగా కాంగ్రెస్, చంద్రబాబులను ఎదుర్కొంటూనే వ్యాపారాలను చక్క దిద్దారు. మీడియా రంగంలో అడుగు పెట్టి సాక్షికి జవసత్వాలు నింపారు. వేలాది మంది ఉద్యోగుల్లో ధైర్యం నింపారు. తుది విజయం మనదే, అధైర్య పడకుండా ముందుకు సాగమని ఉద్యోగులకు ధైర్యం నూరిపోశారు. దేవుడు మన వైపే ఉన్నాడు, ఈ కష్టాలు తాత్కాలికమే మనదే విజయమని ఎప్పుడూ నవ్వుతూ చెప్పేవారు. రాజకీయంగా ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నా, మనసులో అగ్ని పర్వతాలు పేలిపోతున్నా ఆ బాధను ఎక్కడా కూడా బయటకు కనిపించకుండా చూసుకునేవారు. సాక్షిలో ప్యూన్ కనిపించినా ఏమ్మా బాగున్నావా..ఇంట్లో వాళ్లు బాగున్నారా అని ఆప్యాయంగా పలకరించేవారు. ఆమెకు తెలుసు తానే డల్గా కనిపిస్తే ఉద్యోగులు ధైర్యం కోల్పోతారని, అందుకే హృదయంలో కన్నీటి సుడిగుండాలు తిరుగుతున్నా అందమైన నవ్వుతో పలకరించి, ధైర్యం చెప్పేవారు.
మహానేత వైఎస్ఆర్ చనిపోయినప్పటి నుంచి వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చే వరకు భారతీ రెడ్డిగారి త్యాగాలు మరువలేనివి. ఆ త్యాగాలు, ఆమె కష్టం, ఆమె చూపించిన ప్రేమ, ఆమె చాతుర్యంతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధైర్యంతో ముందుకు నడిచారు. అనుకున్నది సాధించారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయంలో సతీమణి భారతీ రెడ్డి పాత్ర మరువలేనిది. ప్రజలే తమ కుటుంబ బలమని విశ్వసిస్తారు భారతీ రెడ్డిగారు. వ్యాపారాలు, రాజకీయాలే కాదు ప్రజా సేవ అంటే కూడా భారతీ రెడ్డిగారికి చాలా ఇష్టం. ఏమాత్రం ఖాళీ దొరికినా వృద్దులు, బదిరీలు ఆశ్రమాల్లో సేవ చేయడానికి ఇష్టపడతారు. ఇంత మంచి మనసు ఉంది కాబట్టే ఆ కుటుంబానికి దేవుడు అండగా ఉంటున్నాడు. వైఎస్ఆర్ కుటుంబం చల్లగా ఉంటేనే కోట్ల కుటుంబాలు చల్లగా ఉంటాయి. ఈ రోజు(డిసెంబర్ 9)న పుట్టిన రోజు జరుపుకుంటున్నా వైఎస్ భారతీ రెడ్డిగారి జన్మదిన శుభాకాంక్షలు. వైఎస్ భారతీ రెడ్డిగారు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
– వై.వి.రెడ్డి, పొలిటికల్ అనలిస్ట్