రాష్ట్రపతులు, ప్రధానులూ వాడేది ఈ పెన్నే
మహాత్మా గాంధీ తన పర్యటనల్లో భాగంగా ఓసారి తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు వస్తున్న సమయంలో రాజమండ్రి గోదావరి రైల్వే స్టేషన్లో ఆగారు. ఆ సమయంలో రాజమండ్రిలోని రత్నంపెన్నుల సంస్థ యజమాని కేవీ రత్నం.. స్వదేశీ తయారీ, విదేశీ వస్తు బహిష్కరణలో భాగంగా తాను తయారు చేసిన పెన్నును గాంధీని కలిసి బహూకరించారు.
స్వదేశీ వస్తువు ఏదైనా చేయమని 1921లో మిమ్మల్ని కలిసినప్పుడు చెప్పిన మాటలే నాకు స్ఫూర్తి అని గాంధీజీతో రత్నం అన్నారు. కానీ గాంధీజీ ఆ పెన్నును చూసి విదేశీ దిగుమతి కావచ్చేమో అని అనుమానం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆయన సహాయకుడు కుమారప్ప స్వయంగా పరిశీలించి, పూర్తి స్వదేశీ తయారీ అని నిర్థరించిన తర్వాత గాంధీ దాన్ని తీసుకున్నారు. ఆ తర్వాత “మీరు పంపిన పెన్ను వాడుతున్నాను, ఆనందంగా ఉంది” అంటూ 1935లో కేవీ రత్నానికి గాంధీ స్వయంగా లేఖ రాయడం విశేషంగా మారింది.

పెన్నుల తయారీ కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన రబ్బరు వాడుతుంటారు. కానీ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా వెండి, బంగారం పెన్నులు కూడా తయారు చేస్తున్నారు. 14 క్యారెట్, 24 క్యారెట్ బంగారం పెన్నులు కూడా సిద్ధం చేస్తున్నారు. అప్పట్లో గాంధీకి అందించిన పెన్ను కూడా 14 క్యారెట్ల బంగారం పాళీతో చేసిందే.
పాళీ తయారీలో 24 క్యారెట్ బంగారం కన్నా 14 క్యారెట్ల బంగారమే సౌకర్యవంతంగా ఉంటుందని, అందుకే ఎక్కువ మంది 14 క్యారెట్ల బంగారంతో తయారయిన వాటికే ప్రాధాన్యమిస్తారు.వీరు తయారు చేసిన 1.5 గ్రాముల బరువుండే అతి చిన్న పెన్, అతి చిన్న బంగారం పెన్నులు చూస్తే ఆశ్చర్యం కలగకమానదు.


రత్నం పెన్నులతో రాయడం అలవాటైతే వేరే పెన్నులు వాడాలని అనిపించదంటారు. రత్నం పెన్స్ కోసం దూరదూరాల నుంచి వస్తుంటారు. రాజమహేంద్రవరంలో ఓ చిన్న సందులో ఉండే ఈ షాపుని వెదుక్కుంటూ ఎక్కడెక్కడి నుంచో ఎందరో రావడాన్ని చూస్తేనే ఆ పెన్నుల నాణ్యతను అర్థం చేసుకోవచ్చు. తరాలు మారినా పెన్నుల ప్రత్యేకత కొనసాగుతూనే ఉంది. రత్నం సోదరులు, వారి కుమారులు కూడా ఇదే వృత్తిగా మలచుకున్నారు. స్వాతంత్ర్య సమరయోధుల నుంచి నేటి తరం నేతల వరకూ పలువురు ఈ పెన్నుల పట్ల ప్రత్యేక ఆసక్తి ప్రదర్శిస్తూనే ఉన్నారు.

మీలో ఎవరు కోటీశ్వరుడు లో ఒకసారి 25 లక్షల ప్రశ్న కింద “మన దేశంలో మొట్ట మొదటి స్వదేశీ పెన్ను ఎక్కడ తయారయ్యింది” అనే ప్రశ్నకు జవాబు రాజమండ్రి అని చెప్పలేక ఒకతను క్విజ్ లో ఓడిపోవడం కొస మెరపు.
– Raghava Rao