హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరూ మా బిడ్డలే

హైదరాబాద్ మహానగరంలో ఉన్న ప్రతి ఒక్కరూ మా బిడ్డలేనని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తెలిపారు. ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ గ్రేటర్ ఎన్నికల ప్రచార సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. టీఆర్ఎస్ ఉద్యమ బాధ్యత ముగిసింది, రాజకీయ పరిణతి సాధించిందని పేర్కొన్నారు.
‘హైదరాబాద్ గడ్డపై ఉన్న ప్రతి బిడ్డా మావారే అని చెప్పాం. దేశం నలుమూలల నుంచి వచ్చిన వారిని మా బిడ్డలుగానే చూస్తున్నాం. ప్రభుత్వం ఎలా పనిచేస్తోంది? అనే చర్చ ప్రజల్లో జరగాలి. ప్రభుత్వ పనితీరుపై చర్చ జరిగినప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. ఓటు వేసేముందు ప్రజలు విచక్షణతో ఆలోచించాలి. పార్టీలకు ఓటు వేసేముందు ప్రజలు ఆలోచించాలి. అప్పుడే మంచినేతలు రాజకీయాల్లో ఉంటారు. ఎన్నికలు చాలా జరుగుతుంటాయి. ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో చర్చ జరగాలి. నాయకుల పనితీరును చూసే ఓటు వేయాలి. ప్రజలు విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలని’ సీఎం కోరారు.’హైదరాబాద్ చైతన్యవంతమైనది..చరిత్ర ఉన్నది. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్వన్ అని కేంద్రం చెప్పింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత మనం సాధించిన తొలి ఘనత విద్యుత్. తాగునీటి సమస్యకు భరతవాక్యం పలికాం. ఎంతో కృషి, పట్టుదలతో కోతలు లేని విద్యుత్ అందిస్తున్నామని’ సీఎం చెప్పారు.
కేసీఆర్ కిట్..సూపర్ హిట్:
రాబోయే కొద్ది నెలల్లో హైదరాబాద్ నగరానికి 24 గంటలు నీళ్లు సరఫరా చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్లో గతంలో జరగని అభివృద్ధి ఇప్పుడు జరుగుతోందని..మరోసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిపించండి అని కేసీఆర్ కోరారు.నగర ప్రజలు, పేదలకు కేసీఆర్ అందించిన కానుక ఉచిత తాగునీరు. అపార్ట్మెంట్లలో ఉన్న ప్రతి కుటుంబానికి 20వుల లీటర్ల ఉచిత మంచినీరు పథకం అమలు చేస్తాం.ఐదేళ్లలో మిషన్ భగీరథ పూర్తి చేశాం. మేం ఇస్తున్న రైతుబంధు ఏ రాష్ట్రంలోనైనా ఉందా? ప్రతీ రైతు కుటుంబానికి రూ.5లక్షల రైతుబీమా అమలు చేస్తున్నాం. యావత్ నగర ప్రజల కోసం 350 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశాం. కులమతాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నాం. కల్యాణలక్ష్మీ, కంటి వెలుగు పథకాలు ఎక్కడా లేవు. కేసీఆర్ కిట్ అన్ని వర్గాల ప్రజలకు అందిస్తున్నాం. కేసీఆర్ కిట్టు..సూపర్ హిట్టు’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
‘దోబీఘాట్లు, సెలూన్లకు ఉచిత విద్యుత్ ఇస్తాం. దేశంలో ఎక్కడాలేని విధంగా వెయ్యి గురుకుల పాఠశాలలు ప్రారంభించాం. కరోనాతో రాష్ట్రానికి రూ.52వేల కోట్ల ఆదాయం కోల్పోయినా ఎక్కడా సంక్షేమ పథకాలు ఆపలేదు. హైదరాబాద్ కోసం కేంద్రాన్ని అడిగినా పట్టించుకోలేదు. హైదరాబాద్ నగరం అశాస్త్రీయంగా పెరిగింది. సరైనా మౌలిక వసతులు లేకుండా కాలనీల నిర్మాణాలు జరిగాయి. వరదల నుంచి హైదరాబాద్ను కాపాడుకోవాలి. దీని కోసం ఏటా 10వేల కోట్లు కేటాయిస్తామని’ సీఎం చెప్పారు.