టీడీపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్

మాజీ మంత్రి, టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడి అరెస్టు వ్యవహారంపై విశాఖ ఏసీబీ అధికారులు స్పందించారు. ఈరోజు ఉదయం 7.30గంటలకు శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని ఆయన స్వగృహంలో అరెస్టు చేసినట్లు ఏసీబీ జేడీ రవికుమార్ తెలిపారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఈఎస్ఐ వ్యవహారంలో అచ్చెన్నాయుడితో సహా ఆరుగురిని అరెస్టు చేసినట్లు చెప్పారు.
‘‘ఈఎస్ఐలో ప్రధానంగా మందులు, ల్యాబ్ కిట్స్, సర్జికల్ ఐటమ్స్, ఫర్నిచర్ కొనుగోళ్లకు సంబంధించి అక్రమాలు జరిగాయి.
మాజీ డైరెక్టర్ సీకే రమేశ్ కుమార్ బంధువుల పేర్లమీద నకిలీ కొటేషన్లతో మార్కెట్ ధర కంటే 50 నుంచి 130 శాతం అధిక ధరలకు కోట్ చేశారు. ఈ-టెండర్ల విధానంలో కాకుండా నామినేషన్ పద్ధతిలో కొనుగోళ్లు చేశారు. గత ఐదేళ్లలో ప్రభుత్వం రూ.988 కోట్లు కేటాయిస్తే .. అందులో రూ.150 కోట్ల వరకు అవినీతి జరిగింది. తప్పుడు ఇన్వాయిస్లతో మందులు కొనుగోలు చేసినట్లు ఆధారాలు లభించాయి. కార్మికశాఖ ఉన్నతాధికారులకు తెలియకుండా కొన్ని వ్యవహారాలు జరిగాయి. మాజీ డైరెక్టర్ సీకే రమేశ్ కుమార్, డాక్టర్ విజయ్కుమార్, అప్పటి కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు మరికొందరి పాత్ర ఇందులో ఉందని ఏసీబీ దర్యాప్తులో తేలింది. దర్యాప్తు బృందాలు ఈరోజు ఉదయం 7.30గంటలకు నిమ్మాడలో అచ్చెన్నాయుడిని అరెస్టు చేశాయి. రమేశ్కుమార్ను తిరుపతిలో, విజయకుమార్ను రాజమహేంద్రవరంలో అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిని ఈరోజు సాయంత్రం విజయవాడలో ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తాం’’ అని జేడీ రవికుమార్ తెలిపారు.